ఆనాటి ఓటమికి ఆమె బదులిచ్చింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో తనను ఓడించిన ప్రత్యర్థిపై నేడు ప్రతీకారం తీర్చుకుంది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు జయకేతనం ఎగురవేసింది. జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 22-20, 11-21, 21-18తో సింధు విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఒకుహర చేతిలో సింధు ఓటమి చవిచూసి రజతంతో సరిపెట్టుకుంది.
ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో అద్భుతంగా పోరాడిన సింధుకు తృటిలో స్వర్ణం చేజారిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్లో సింధును ఓడించి ఒకుహర ఛాంపియన్ అయ్యింది. అయితే శనివారం జరిగిన కొరియా ఓపెన్ సెమీఫైనల్లో సింధు గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రపంచ నంబర్-2 యమగూచిని ఓడించి జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహర ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో మరోసారి వీరిద్దరికి టైటిల్ పోరు పడింది. ఆదివారం ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్లో సింధు విజయం సాధించింది.
ఆరంభం నుంచే ఒకుహర దూకుడు ప్రదర్శించగా.. సింధు కూడా దీటుగా బదులిచ్చి 22-20తో తొలి గేమ్ను కైవసం చేసుకుంది. అయితే తొలి గేమ్లో ఆధిక్యం ప్రదర్శించిన సింధు.. రెండో గేమ్లో కాస్త తడబడింది. ఒకుహర విజృంభించడంతో సింధు తేలిపోయింది. దీంతో 11-21తో రెండో గేమ్ను కోల్పోయింది. ఇక డిసైడ్ చేసే మూడో గేమ్లో సింధు మళ్లీ పుంజుకుని 21-18తో టైటిల్ను దక్కించుకుంది.
Posted On 17th September 2017