కావలసినవి
ఇడ్లీ బియ్యం: అరకప్పు, ముడిబియ్యం లేదా అటుకులు: అరకప్పు, మినప్పప్పు: పావు కప్పు, మెంతులు: అర టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, తాలింపుకోసం: ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెబ్బ, కొబ్బరి తురుము: 2 టేబుల్స్పూన్లు, మినప్పప్పు: టేబుల్స్పూను, సెనగపప్పు: టేబుల్స్పూను, ఆవాలు: టీస్పూను, నూనె: టేబుల్స్పూను
తయారుచేసే విధానం
* బియ్యం, మినప్పప్పు, మెంతులు అన్నీ కడిగి విడివిడిగా గిన్నెల్లో పోసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరవాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బి, ఉప్పు కలపాలి. ఈ పిండిని కనీసం ఓ పది గంటలు పులియనివ్వాలి. అది రెండింతలు అయ్యాక వేస్తే పనియారం లేదా పొంగడాలు బాగా వస్తాయి. వీటిని ఇడ్లీ లేదా దోసెపిండితో కూడా వేసుకోవచ్చు.
* ఓ బాణలిలో నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నీ కొబ్బరి తురుమునీ పిండిలో కలపాలి. పొంగడాల పెనాన్ని స్టవ్మీద పెట్టి ఒక్కో గుంతలో రెండుమూడు చుక్కల నూనె వేసి, పిండి మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఓ నిమిషం ఉడికించాలి. తరవాత చెక్కస్పూనుతో దాన్ని నెమ్మదిగా రెండో వైపునకు తిప్పాలి. ఇలా రెండు వైపులా సిమ్లో లేదా మీడియం మంట మీద ఉడికించి దించితే చెట్టినాడ్ పొంగడాలు రెడీ.
Posted On 14th October 2017