ప్రభాస్‌ ‘సాహో’ టీజర్...ఇట్స్‌ షో టైమ్‌

‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ చిత్ర టీజర్‌ విడుదలైంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజా టీజర్‌లో ప్రభాస్‌ రక్తమోడుతూ కూర్చుని చూస్తుండగా, ‘ఆ రక్తం చూస్తేనే అర్థమవుతోంది రా! వాడిని చచ్చేలా కొట్టారని’ అంటూ వెనుక నుంచి ఓ వ్యక్తి గొంతు వినిపిస్తుంది. ‘సార్‌.. ఆ రక్తం వాడిది కాదు.. మనవాళ్లది’ అని మరో గొంతు సమాధానం ఇవ్వడం, ముఖంపై పడిన రక్తాన్ని తుడుచుకుంటూ ప్రభాస్‌ ‘ఇట్స్‌ షో టైమ్‌’ అంటూ చిన్నగా నవ్వుతూ పలికే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. చివర్లో వింగ్‌ సూట్‌ ధరించిన ఇద్దరు వ్యక్తులు ఓ పెద్ద భవనంపై నుంచి కిందకు దూకి గాల్లో రయ్‌మంటూ దూసుకెళ్లే సన్నివేశం చూస్తుంటే హాలీవుడ్‌ రేంజ్‌లో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ‘సాహో’ చిత్రం 2018లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పటివరకూ ‘సాహో’లో కథానాయిక ఎవరన్నదీ ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ సంగీత త్రయం శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

Posted On 27th April 2017

Source eenadu