కావాల్సిన పదార్థాలు:
మామిడికాయలు-4,
చింతపండు రసం- 1 కప్పు,
నూనె (సన్ఫ్లవర్ లేదా నువ్వుల నూనె)- 150 గ్రాములు,
ఉప్పు- తగినంత,
కారం- నిండుగా రెండు టేబుల్స్పూన్లు,
ఇంగువ- 1 టేబుల్స్పూను,
పల్లీలు- 2 టేబుల్స్పూన్లు,
శెనగపప్పు- అర టేబుల్స్పూను,
మినప్పప్పు- అర టేబుల్స్పూను,
ఆవాలు- పావు టేబుల్స్పూను,
జీలకర్ర- పావు టేబుల్స్పూను,
పచ్చిమిర్చి - 3,
అల్లం- కొద్దిగా (చిన్నగా, సన్నగా తరగాలి),
కరివేపాకు- తగినన్ని.
తయారీ విధానం: పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరగాలి. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి పిండాలి. మామిడికాయల మీద ఉండే తొక్క తీయకుండా చిన్న ముక్కలు తరగాలి. కడాయిలో నూనె వేడిచేశాక పల్లీలు, శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి లేత ఎరుపురంగుకి వచ్చేవరకూ వేగించాలి. ఈ తాలింపులో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి తరుగు వే సి బాగా వేగించాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసి ఇంగువ, ఉప్పు, కరివేపాకులు జోడించాలి. ఈ మిశ్రమంలో కారం వేసి గరిటెతో బాగా కలిపి అందులోని నూనె మోతాదు తగ్గేవరకు ఉడికించాలి. ఆ తర్వాత మామిడికాయ ముక్కలను తాలింపులో వేసి స్టవ్ మీద నుంచి దించి గరిటెతో బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మామిడికాయ ముక్కలకు ఉప్పు, కారాలు బాగా పడతాయి. వేడిగా ఉన్న పులిహోర ఆవకాయను పెద్దపళ్లెంలో పోసి ఆరబెట్టాలి. అది చల్లారిన తర్వాత గాలి చొరబడని సీసాలో పెట్టాలి. ఈ పులిహోర ఆవకాయ నెలరోజులు నిల్వ ఉంటుంది.
Posted On 12th May 2017