విచారణ తర్వాత... వీడియో పోస్ట్ చేసిన పూరీ జగన్నాథ్

డ్రగ్స్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొన్న అనంతరం దర్శకుడు పూరీ జగన్నాథ్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పూరీ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. సిట్ విచారణకు వెళ్లానని, వారికి పూర్తిగా సహకరించానని పూరీ తెలిపాడు. సమాజంలో తానెంతో బాధ్యత కలిగిన వ్యక్తినని, పోలీసులు, మీడియా అంటే తనకెంతో ఇష్టమని పూరీ వెల్లడించాడు. పోలీసులపై తాను ఎన్నో సినిమాలు తీశానని, జర్నలిస్టుల కోసం ఇజం సినిమా తీశానని చెప్పాడు.

అయితే మీడియా తన విషయంలో ప్రవర్తించిన తీరుపై పూరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీడియా రేటింగ్స్ కోసం కట్టు కథలు అల్లి ప్రోగ్రామ్స్ చేసిందని.. వాటి వల్ల తన కుటుంబం బాధతో కుమిలిపోతోందని పూరీ చెప్పాడు. ఈ విషయంలో తాను కూడా ఎంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. నిజంగా చెప్పాలంటే మీడియా జీవితాలను నాశనం చేసిందని పూరీ ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియా చేసిన పని వల్ల తాను మాత్రమే కాదని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని పూరీ తెలిపాడు. మీడియా తననెంతో డిస్టర్బ్ చేసిందని పూరీ తన అక్కసు వెళ్లగక్కాడు.

Posted On 20th July 2017

Source andhrajyothi