జియో నుంచి కీలక ప్రకటనలు ?
జియో నుంచి కీలక ప్రకటనలు ?

టెలికాం రంగంలో ప్రవేశంతోనే సంచలనాలకు చిరునామాగా మారిన రిలయన్స్‌ జియో మరిన్ని కీలక ప్రకటనలు చేయబోతుందా? అంటే అవుననే అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటాతో ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేసిన ఆ సంస్థ మరిన్ని షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఈ నెల 21 జరిగే ఆ సంస్థ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) వేదిక కానుందని సమాచారం.

రూ.500కే ఫోన్‌ 
రిలయన్స్‌ జియో నుంచి రూ.500కే ఫోన్‌ వస్తుందని ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమావేశంలో దాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఇంటెక్స్‌ సంస్థ తయారు చేస్తున్న ఈ ఫోన్‌ను రాయితీపై వినియోగదారులకు జియో అందివ్వనుంది. 4జీ వీఓఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఈ ఫోన్‌ చౌక ధరకే ఇవ్వడం ద్వారా మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు జియోకు అవకాశం ఏర్పడుతుంది.

కొత్త ప్లాన్స్‌.. 
వెల్‌కమ్‌ ఆఫర్‌, న్యూఇయర్‌ ఆఫర్‌, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్ల పేరిట ఇంతకాలం ఉచిత సేవల్ని అందించిన జియో ఇటీవల మరో రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. కొత్తగా రూ.349, రూ.399 ప్లాన్లను తీసుకొచ్చింది. తాజా సమావేశంలో రూ.80-90 మధ్య ఓ ప్రత్యేక ప్లాన్‌ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని సమాచారం. అయితే, ఈ ప్లాన్‌ కొత్తగా తీసుకొచ్చే జియో ఫీచర్‌ ఫోన్‌కా? లేక వినియోగదారులందరికా? అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.

బ్రాడ్‌బాండ్‌.. 
ఇదే ఏజీఎంలో జియో బ్రాడ్‌బాండ్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోంది. జియో ఫైబర్‌ పేరిట తీసుకొస్తున్న ఈ సేవలను ఇప్పటికే ఆరు నగరాల్లో జియో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఈ కనెక్షన్‌ తీసుకుంటే 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ డేటాను మూడు నెలల పాటు ఉచితంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇందుకు గానూ రూ.4500 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

మైలురాళ్లు.. లెక్కలు 
వచ్చీ రావడంతోనే సంచలనాలకు వేదికై ఎన్నో రికార్డులను సాధించింది జియో. వేగంగా 10 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్‌వర్క్‌గానూ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, అంకెలను ఏజీఎంలో ప్రకటించే అవకాశం ఉంది. వీటిలో ఎన్ని ప్రకటనలను రిలయన్స్‌ జియో చేస్తుందో.. ఇంకా ఏవైనా కొత్త ప్రకటనలు చేస్తుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే..!!

Posted On 19th July 2017

Source andhrajyothi