సంచలన విషయాలు బయటపెట్టిన శివాజీ

సినీనటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ సంచలన విషయాలు బయటపెట్టారు. దక్షిణ భారతదేశంలో అధికారమే లక్ష్యంగా ఒక జాతీయ పార్టీ పన్నిన కుట్రల గురించి పూసగుచ్చినట్లు వివరించారు. ఆ కుట్ర మొత్తానికి పెట్టుకున్న పేరే ఆపరేషన్ ద్రవిడ.

మళ్ళీ ఆపరేషన్ ద్రవిడ ను 3 భాగాలుగా విభాజించారని ఆయన చెప్పారు. అవేంటంటే

  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – ఆపరేషన్ గరుడ
  • కర్ణాటక – ఆపరేషన్ కుమార
  • తమిళనాడు, కేరళ – ఆపరేషన్ రావణ

ఆపరేషన్‌ ద్రవిడలో ప్రధానమైన వ్యక్తిని ‘గురు’గా సంబోధించారు. గురు ఆదేశాలను స్థానికంగా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్లు అమలు చేస్తారని తెలిపారు.

ఆపరేషన్ గరుడ లక్ష్యం

  • ఆంధ్రప్రదేశ్ ను దారుణంగా దెబ్బ తీసేందుకు జాతీయ పార్టీ స్కెచ్‌ వేసిందని, అధికార పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇది జరుగుతుందని చెప్పారు
  • సీబీఐ కేసులు తెరవడం
  • అధికార పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం
  • చక్రబంధంలో ఇరికించడం
  • 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడం

దీనికోసం... రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారని చెప్పారు. ‘‘ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారు. ఇలా వచ్చే వారిలో ఒక కొత్త నాయకుడు ఉన్నారు.

అందరికంటే కొత్త నాయకుడు చాలా ప్రమాదకరం. తనకు రాష్ట్రంపై బాధ్యత ఉన్నట్లు, తాను పరిశోధన చేసినట్లు ప్రజల్లోకి కొన్ని సంకేతాలు పంపిస్తారు. ఆయనకు ఇద్దరు రిటైర్డ్ IAS, ఒక సీనియర్‌ పాత్రికేయుడు సహకరిస్తారు. నిజానికి కొత్త నాయకుడి వ్యూహం గురించి వీరికి కూడా తెలియదు.అధికార పార్టీని అలజడిలోకి నెట్టడమే ఈ కొత్త నాయకుడి పని’’ అని శివాజీ వివరించారు.

నలుగురు వ్యక్తులు ఢిల్లీలో కూర్చుని ఇప్పటికే సీబీఐ కేసులు తెరిచే పని మొదలుపెట్టారన్నారు. ఇదే క్రమంలో, ఇప్పటికే ఉన్న పార్టీ నాయకుడికి (కేసుల నుంచి) కొంత ఊరట లభిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర

ఆపరేషన్‌ గరుడలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన పార్టీయే అసలు బలి పశువు అవుతుందని శివాజీ తెలిపారు. ఆ పార్టీ నాయకుడిపై ఉన్న కేసులను అడ్డు చేసుకుని దగ్గరికి తెచ్చుకుంటారన్నారు. ఆ ముఖ్య నాయకుడిపై ‘ప్రాణహాని’ లేకుండా దాడి చేయిస్తారని శివాజీ తెలిపారు.

ఇప్పటికే హైదరాబాద్‌, గుంటూరులో రెక్కీ కూడా జరిగిందని తెలిపారు. ప్రాణహాని లేని దాడి తర్వాత అల్లర్లు సృష్టిస్తారన్నారు. ఈ దాడిని రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడి కుటుంబంపై వేసే యోచన కూడా ఉందని, ఒడిసా, బిహార్‌ వ్యక్తులు హింసకు పాల్పడతారు. రాష్ట్రంలో అలజడి మొదలవుతుందని అయన తెలిపారు. అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. అప్పటికే ఉన్న సీబీఐ కేసులూ ఇక్కట్లలోకి నెడతాయన్నారు.

ఈ ఆపరేషన్‌కు ‘సెప్టెంబరు 1’ క్లైమాక్స్‌ పడుతుందన్నారు. అల్లర్లు, అలజడని కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్నారు.

వారి లక్ష్యం ఎలా నేరవేరుతుందంటే:

ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రాంతీయ పార్టీలన్నీ నిర్వీర్యం అవుతాయని, ఎన్నికల్లో జాతీయ పార్టీకి, కొత్త పార్టీకి సీట్లు వస్తాయని... కేసులు, ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్న అధికార పార్టీ దెబ్బతింటుందని ఆయన చెప్పారు. మరో ముఖ్య నాయకుడిని పెండింగ్‌ కేసుల్లో జైలుకు పంపిస్తారని, ఆ పార్టీ కథ ముగుస్తుందని చెప్పారు.

దీనితో ‘‘అధికార పార్టీలో ఉన్న నేతలంతా ఇతర రెండు మూడు పార్టీల్లోకి వెళతారు. ఎన్నికలు జరుగుతాయి. కొత్తపార్టీకి, ముఖ్యపార్టీకి సీట్లు వస్తాయి. కొత్త పార్టీ నాయకుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామంటారు. ఆయన తనకు వద్దని అలిగి వెళ్లిపోతాడు. మొత్తంగా మూడు పార్టీల కథ ముగుస్తుంది. దీంతో ఆపరేషన్‌ గరుడకు తెర పడుతుంది’’ అని శివాజీ తెలిపారు.

ఆ తర్వాత జాతీయ పార్టీకి చెందిన తెలుగు వ్యక్తే ఏపీకి ముఖ్యమంత్రిగా వస్తారన్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకూ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. 2013 నుంచి తనకు దేశం పట్ల అవగాహన ఉందని, దీంతో తనకు ఢిల్లీలో కొందరు పరిచయమయ్యారని తెలిపారు. జాతీయ పార్టీకి అనుబంధంగా ఉండే ‘కల్యాణ్‌జీ’ అనే వ్యక్తి తనకు ఈ వివరాలు చెప్పారన్నారు. సంస్థాగతంగా కల్యాణ్‌జీ అని పిలుచుకున్నప్పటికీ, అసలు పేరు వేరే ఉండవచ్చునన్నారు.

Posted On 23rd March 2018