జగన్ భల్లాలదేవుడు, మోడీ బిజ్జల దేవుడు
జగన్ భల్లాలదేవుడు, మోడీ బిజ్జల దేవుడు

మోదీ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తోందని, ఆయనకు కుటుంబ విలువలు తెలియవని, అందుకే తమ కుటుంబంపై పదేపదే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిన మోడీ ఆంధ్రప్రదేశ్‌ గడ్డపై అడుగుపెట్టే అర్హత ఆయనకు లేదని చంద్రబాబు అన్నారు.

తనది యూటర్న్‌ కాదని.. ఎప్పుడూ రైట్‌ టర్నేనని స్పష్టంచేశారు. సోమవారం రాత్రి చిత్తూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు ప్రసంగించారు. ఐదు కోట్ల ఆంధ్రా ప్రజలు బాహుబలి అయితే జగన్‌ భళ్లాలదేవుడని, కుట్రలు, కుతంత్రాలు చేసే బిజ్జలదేవుడు మోదీ అని చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరం సభలో భల్లాలదేవుడు అంటూ చంద్రబాబును ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలపై, చంద్రబాబు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలను సాగనీయబోమని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఏడు మండలాల గురించి మాట్లాడుతున్నారని, గట్టిగా మాట్లాడితే భద్రాచలం కూడా ఏపీదేనన్నారు. ఏడు మండలాలు తీసుకొని పోలవరం ఆపేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం ఏటీఎంలా తయారైందని మోదీ అంటున్నారని, అసలు ఆ ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. మాల్యా సహా అనేక మందిని మోదీ విదేశాలకు పంపారని ధ్వజమెత్తారు.

Posted On 2nd April 2019