జనసేన MP అభ్యర్థి కన్నుమూత
జనసేన MP అభ్యర్థి కన్నుమూత

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన సీనియర్ నాయకుడు, వ్యాపారవేత్త... నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) కన్నుమూశారు. హైదరాబాద్ కేర్ హాస్పిటల్ (బంజారాహిల్స్‌) లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు.‌ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి, ఏప్రిల్ 3న కేర్ ఆసుపత్రిలో చేరారు.

ఎస్పీవై ‌రెడ్డి జూన్ 4, 1950 లో కడప జిల్లా అంకాలమ్మగూడూరులో జన్మించారు. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు. 1991 ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన నంద్యాల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే నంద్యాల అసెంబ్లీ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి, 2004లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత వరుసగా 2009, 2014లో కూడా నంద్యాల ఎంపీగా గెలిచారు. అయితే ఆ తర్వాత , 2014 లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నంద్యాల సీటు ఆశించి భంగపడ్డ ఆయన జనసేనలో చేరి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

Posted On 30th April 2019