మహారాష్ట్ర రాజకీయాల్లో తెల్లవారుజామున అనూహ్య పరిణామం చోటుచేసుకుంది... మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి - ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోయాయి. అయితే మిత్రపక్షం శివసేనకు బిజెపి భారీ షాక్ ఇచ్చినట్లయింది. గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ఈ రోజు ఉదయం ప్రమాణం చేయించారు.
రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన కొంతసేపటికే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అక్కడే బిజెపి - ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు విశ్లేషిస్తున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఫడ్నవీస్ మోదీ, అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Posted On 23rd November 2019